అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని “క్రీడలకు అవును.. మాదకద్రవ్యాలకు కాదు” అనే నినాదంతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వాలీబాల్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించారు.
_ యువతను ప్రోత్సహించే విధంగా సి ఐ గడ్డం మల్లేష్ అడుగులు..
_ జీడిమెట్ల పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్
_ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి
లోకల్ వైబ్స్, జీడిమెట్ల: యువత మాదకద్రవ్యాల వంటి వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడల వైపు అడుగులు వేయాలని కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని “క్రీడలకు అవును.. మాదకద్రవ్యాలకు కాదు” అనే నినాదంతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వాలీబాల్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు నియోజకవర్గ వ్యాప్తంగా విశేష స్పందన లభించింది.
ఉత్సాహంగా సాగిన పోటీలు.. 42 జట్ల భాగస్వామ్యం..
ఈ టోర్నమెంట్లో మొత్తం 42 జట్లు (260 మంది క్రీడాకారులు) అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నాయి. ఇందులో బాలికల విభాగంలో 10 జట్లు, బాలుర విభాగంలో 16 జట్లు, స్థానిక పౌరుల విభాగంలో 16 జట్లు తలపడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పోటాపోటీగా ఆడి క్రీడా స్ఫూర్తిని చాటారు. పోటీలు ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన ముగింపు సభలో డీసీపీ కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు, రన్నరప్గా నిలిచిన జట్లకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.

వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు: ఏసీపీ బాల గంగిరెడ్డి..
కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ ఏసీపీ బాల గంగిరెడ్డి మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు చదువుతో పాటు శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలను అలవర్చుకోవాలన్నారు. మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, క్రీడల ద్వారా ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.

ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎస్హెచ్ఓ మల్లేష్
జీడిమెట్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ.. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహించినట్లు తెలిపారు. పోటీలను విజయవంతం చేయడానికి సహకరించిన వివిధ పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పౌరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టోర్నమెంట్ ముగింపు సందర్భంగా క్రీడాకారులు, విద్యార్థులందరితో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.


