108 అంబులెన్సులలో పాముకాటుకు సంబంధించిన యాంటీ వెనమ్ (విరుగుడు మందు) ఇస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా 108 మేనేజర్ దండవేణి తిరుపతి, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ తోకల శ్రీకాంత్ స్పష్టం చేశారు.
_ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం..
_ నమ్మకండి : మేడ్చల్ జిల్లా 108 అధికారులు..
లోకల్ వైబ్స్, మేడ్చల్ : 108 అంబులెన్సులలో పాముకాటుకు సంబంధించిన యాంటీ వెనమ్ (విరుగుడు మందు) ఇస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా 108 మేనేజర్ దండవేణి తిరుపతి, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ తోకల శ్రీకాంత్ స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న ఈ ఫేక్ న్యూస్ను చూసి ప్రజలు మోసపోవద్దని వారు అప్రమత్తం చేశారు.
ఇంటి వద్ద ఇంజెక్షన్లు ఇవ్వడం ప్రాణాంతకం..
పాము కాటు బాధితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి దగ్గర ఇంజెక్షన్లు ఇవ్వకూడదని, అలా చేయడం ప్రాణాలకే ముప్పు అని అధికారులు హెచ్చరించారు. పాముకాటుకు ఇచ్చే విరుగుడు మందును తప్పనిసరిగా తగిన సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో, కేవలం అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే అందించాలని వారు వివరించారు.
కేవలం ఆసుపత్రికి తరలించేందుకే 108 సేవలు..
ఎవరైనా ప్రమాదానికి గురైనా లేదా పాముకాటుకు గురైనా.. ఆ సంఘటనా స్థలంలో వారికి తక్షణమే ప్రాథమిక చికిత్స (ఫస్ట్ ఎయిడ్) అందించి, ప్రాణాపాయం నుంచి కాపాడటమే 108 సిబ్బంది ప్రాథమిక బాధ్యత. ఆ వెంటనే వారిని అత్యంత సురక్షితంగా దగ్గరలోని ఆసుపత్రికి తరలించేందుకే 108 వాహనాలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. కాబట్టి, సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి నిరాధారమైన అబద్ధాలను నమ్మొద్దని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

