*– తాళం వేయకుండానే వెళ్ళిపోయిన సిబ్బంది..*
*– రాత్రంతా తెరిచే తలుపులు!*
(లోకల్ వైబ్స్ – కుత్బుల్లాపూర్):ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరువైంది. ప్రజల కీలక పత్రాలకు భద్రత లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందనడానికి ఈ ఘటనే నిదర్శనం. కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని చింతల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న దృశ్యాలు స్థానికులను విస్తుపోయేలా చేశాయి. సిబ్బంది బాధ్యతారాహిత్యంతో కార్యాలయానికి తాళం కూడా వేయకుండానే ఇళ్లకు వెళ్లిపోయారు.
అసలేం జరిగిందంటే..?
సోమవారం కార్యాలయంలో యధావిధిగా ‘ప్రజావాణి’ కార్యక్రమం జరిగింది. ప్రజల నుండి పెద్ద ఎత్తున అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం, సాయంత్రం ఆఫీసు ముగించుకుని వెళుతున్న సమయంలో, సిబ్బంది కనీస బాధ్యతను మరిచారు. కార్యాలయ ప్రధాన గేటుతో పాటు, లోపలి గదుల తలుపులకు కూడా తాళాలు వేయకుండానే అందరూ వెళ్ళిపోయారు.
రాత్రి 10 దాటినా తెరిచే తలుపులు:
సర్కిల్ కార్యాలయం లైట్లు వెలుగుతూ, తలుపులు, మెయిన్ గేటు బార్ల తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికులు షాక్కు గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా ఎవరూ లేకపోవడంతో, సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడియో తీశారు. సదరు వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో (Social Media) విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పలు ప్రముఖ దినపత్రికలలో కూడా కథనాలు ప్రచురితమయ్యాయి.
స్థానికుల ప్రశ్న.. బాధ్యులెవరు?
కార్యాలయంలో విలువైన కంప్యూటర్లు, ప్రింటర్లు మరియు ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అత్యంత కీలకమైన భూగర్భ, ఆస్తి పత్రాలు, అర్జీలు ఉన్నాయి. “ఒకవేళ దొంగలు పడి ఈ విలువైన సామాగ్రిని, పత్రాలను ఎత్తుకెళితే బాధ్యత ఎవరిది? ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన పత్రాలు దొంగలపాలైతే మళ్ళీ వారు ఎక్కడి నుండి తెచ్చుకోవాలి?” అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉన్నతాధికారులు స్పందిస్తారా?ఇంతటి ఘోర బాధ్యతారాహిత్యానికి ఒడిగట్టిన సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా? లేక ఇలాగే వదిలేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
(షార్ట్ వీడియో కోసం క్లిక్ చేయండి : https://youtube.com/shorts/30rmpDqLP58?feature=share)
(మరిన్ని షార్ట్ వీడియోలు, వేగవంతమైన వార్తా కథనాల కోసం ఫాలో అవ్వండి..: https://www.youtube.com/channel/UC91bzRbHRAIGkuWPyN80Ijg ” లోకల్ వైబ్స్ “)

