జీడిమెట్ల సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడటమే కాకుండా, అతని వద్ద ఉన్న రూ. 2 లక్షల నగదు, బంగారాన్ని సురక్షితంగా అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నారు 108 అంబులెన్స్ సిబ్బంది.
లోకల్ వైబ్స్, (జీడిమెట్ల): ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవులుగా నిలవడమే కాకుండా, తమ నిజాయితీతో అందరి మన్ననలు పొందుతున్నారు 108 అంబులెన్స్ సిబ్బంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి పాలైన ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడటంతో పాటు, అతని వద్ద ఉన్న లక్షల రూపాయల నగదు, విలువైన బంగారు ఆభరణాలను సురక్షితంగా బాధితుడి స్నేహితులకు అప్పగించి ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటన కుత్బుల్లాపూర్ – ఓల్డ్ జీడిమెట్ల పరిధిలో చోటుచేసుకుంది.
*ప్రమాదం ఎలా జరిగిందంటే..*
నిజామాబాద్ జిల్లాకు చెందిన శివ ప్రసాద్ గౌడ్ శనివారం తన ద్విచక్ర వాహనంపై సుచిత్ర నుండి మేడ్చల్ వైపు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో జీడిమెట్ల విలేజ్ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద బైక్ అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సకాలంలో స్పందించిన ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ పైలట్ నవీన్, ఈ.ఎం.టి (EMT) రాజు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన శివ ప్రసాద్ గౌడ్కు అక్కడే ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
*నిజాయితీని చాటుకున్న పైలట్, ఈఎంటీ..*
సహాయక చర్యల సమయంలో బాధితుడి వద్ద ఉన్న విలువైన వస్తువులను అంబులెన్స్ సిబ్బంది భద్రపరిచారు. ఆసుపత్రికి చేరుకున్న అనంతరం బాధితుడి స్నేహితులకు సమాచారం అందించి వారిని పిలిపించారు. వారి సమక్షంలో రూ. 2 లక్షల నగదు, ఒక బంగారు గొలుసు, ఒక వెండి బ్రాస్లెట్, రెండు మొబైల్ ఫోన్లు ను అందచేశారు.

*108 సిబ్బంది ప్రశంసలు*
క్లిష్ట సమయంలో స్పందించి సకాలంలో వైద్యం అందించడమే కాకుండా, లక్షల రూపాయల విలువైన వస్తువులను, నగదును ఎలాంటి స్వార్థం లేకుండా తిరిగి ఇచ్చి నిజాయితీని చాటుకున్న పైలట్ నవీన్, EMT రాజులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బాధితుడి స్నేహితులతో పాటు స్థానికులు కూడా 108 సిబ్బంది సేవలను, వారి నిజాయితీని ప్రత్యేకంగా అభినందించారు.

