*– మహారాష్ట్ర.. రూట్ వయా హైదరాబాద్.. మేడ్చల్ వద్ద పట్టుబడిన 3 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు!*
లోకల్ వైబ్స్, మేడ్చల్:పోలీసుల కళ్లుగప్పి నకిలీ పత్తి విత్తనాలను పొరుగు రాష్ట్రానికి తరలిస్తున్న ఓ భారీ ముఠా ఆట కట్టించారు పోలీసులు. రైతులను నిలువునా ముంచేందుకు ప్రయత్నించిన ఈ వ్యవహారాన్ని మేడ్చల్, కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. సుమారు రూ.30 లక్షల విలువైన నిషేధిత ‘బిజి-3’ విత్తనాలతో పాటు, రవాణాకు వాడిన బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు.రైతులను మోసం చేస్తూ నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు శనివారం డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు. తెలిపిన వివరాల ప్రకారం..

*కర్నూలు టు మహారాష్ట్ర వయా హైదరాబాద్* కర్నూలు నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్కు నకిలీ పత్తి విత్తనాలు సరఫరా అవుతున్నాయన్న పక్కా సమాచారంతో శుక్రవారం (ఏప్రిల్ 3న) మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న బొలెరో (AP 39 VE 4038) వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అసలు గుట్టు రట్టయింది. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు నిందితులు ఓ భారీ స్కెచ్ వేశారు. వాహనంలో పైన కూరగాయల (క్యాలీఫ్లవర్/క్యాబేజీ) బస్తాలను పేర్చి, వాటి కింద సుమారు 3000 కిలోల (3 టన్నుల) నకిలీ పత్తి విత్తనాలను దాచి తరలిస్తున్నారు. వీటి విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. విత్తనాలతో పాటు రూ.8 లక్షల విలువైన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

*ఇద్దరు అరెస్టు…పరారీలో మరొకరు*
ఈ ఘటనకు సంబంధించి చెవుల నర్సిములు, వాహన డ్రైవర్ కమ్ ఓనర్ అయిన తలారి రమేష్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ దందాకు ప్రధాన సూత్రధారి అయిన మగులూరి సాంబశివరావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశామని డీసీపీ కోటిరెడ్డి వివరించారు. రైతులు ఎవరైనా ఇలాంటి నకిలీ విత్తనాల బారిన పడొద్దని, ఎక్కడైనా అనుమానాస్పదంగా విక్రయాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ ఆపరేషన్లో మేడ్చల్ అదనపు డీసీపీ విష్ణు ప్రసాద్, ఏసీపీ శంకర్ రెడ్డి, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, ఎస్ఓటి ఎస్ఐ రాజేష్ , మేడ్చల్ క్రైమ్ ఇన్స్పెక్టర్ పి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


