తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ద్వారా సాంస్కృతిక జాగృతిని రగిలించిన కవిత, రాజకీయ అధికారం ద్వారానే ప్రజలకు మేలు చేయగలమన్న సంకల్పంతో ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరిట కొత్త రాజకీయ పార్టీని మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా అధికారికంగా ప్రకటించారు.
_ తెలంగాణ గడ్డపై మరో కొత్త పార్టీ..
_ మునీరాబాద్ వేదికగా కొత్త పార్టీ ప్రకటన..
_ కేసీఆర్, రేవంత్, బీజేపీల తీరుపై నిప్పులు..
_ ఢిల్లీకి బీజేపీ ఎంపీలు బానిసలయ్యారని ఆరోపణ
_ కేసీఆర్ ఓ మరబొమ్మ.. ప్రస్తుత సీఎం ఓ హిట్లర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు
_ ఐదు సూత్రాలతో సరికొత్త ఎజెండా వెల్లడి
_ గత ప్రభుత్వ తప్పులపై తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ
_ ‘పాంచజన్యం’ పేరుతో ఐదు సూత్రాల మేనిఫెస్టో ప్రకటన
లోకల్ వైబ్స్, మేడ్చల్ : తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ద్వారా సాంస్కృతిక జాగృతిని రగిలించిన కవిత, రాజకీయ అధికారం ద్వారానే ప్రజలకు మేలు చేయగలమన్న సంకల్పంతో ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరిట కొత్త రాజకీయ పార్టీని మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ పాలన, కేంద్రంలోని బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత పాలకుల తప్పులకు బాధ్యత వహిస్తూ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన ఆమె, రాబోయే రెండేళ్లలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ విధివిధానాలను ‘పాంచజన్యం’ పేరుతో ఐదు సూత్రాలుగా వెల్లడించారు.

గత తప్పులకు క్షమాపణలు.. ఆ కేసీఆర్ ఇప్పుడు లేరు..
పన్నెండేళ్ల రాష్ట్రంలో మనం కన్న కలలు ఇంకా సాకారం కాలేదని, ఇసుక దందాలను ప్రశ్నించిన దళితులపై దాడులు జరుగుతున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తాను కూడా ఒక కుటుంబ సభ్యురాలిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని, ఆనాటి తప్పులకు తెలంగాణ ప్రజలు తనను క్షమించాలని ఆమె కోరారు. నాడు ఉద్యమంలో అండగా నిలిచిన కేసీఆర్ ఇప్పుడు లేరని, ఇప్పుడున్నది ఆత్మ లేని, కళ్లు లేని మరబొమ్మ లాంటి కేసీఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింగరేణి కార్మికుడు చనిపోయినా, అర్ధరాత్రి పేదల ఇళ్లు కూలగొడుతున్నా ఆదుకునే నాథుడు కరవయ్యాడన్నారు.*కర్కోటక పాలన.. సీఎం ఓ హిట్లర్*ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఆమె ‘కర్కోటకుడు’, ‘హిట్లర్’ తో పోల్చారు. భద్రాచలంలో గర్భిణి మరణించినా, కుమ్రంభీంలో రెండు నెలల పసికందు చనిపోయినా, గురుకులాల్లో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. మరోవైపు, రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు ఢిల్లీ నాయకులకు బానిసల్లా మారారని, భద్రాచలం ఐదు గ్రామాలను వెనక్కి తెచ్చే దమ్ము వారికి ఉందా అని ఆమె సవాల్ విసిరారు.

‘పాంచజన్యం’తో నవ తెలంగాణ నిర్మాణం..
కేవలం వీధుల్లో పోరాడితే సరిపోదని, అధికారం ఉంటేనే మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు అమ్మలాంటి పాలన అందించగలమన్న ఉద్దేశ్యంతోనే పార్టీని స్థాపిస్తున్నట్లు కవిత స్పష్టం చేశారు. ఈ క్రమంలో ‘పాంచజన్యం’ పేరుతో ఐదు కీలక హామీలను ప్రకటించారు. ప్రతి ఊరిలో బడి, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా చూస్తూ.. ఎల్కేజీ నుంచి పీజీ వరకు తల్లిదండ్రులపై ఒక్క రూపాయి భారం పడకుండా ఉచిత విద్యనందిస్తామన్నారు. ఎంత పెద్ద జబ్బుకైనా ఏ ఆసుపత్రిలోనైనా పైసా ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.’రైతే రాజు’ నినాదాన్ని నిజం చేస్తూ, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రైతుల కోసం ప్రత్యేక కుర్చీ, కౌంటర్ ఏర్పాటు చేసి సగౌరవంగా సేవలు అందిస్తామన్నారు. అలాగే 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పారు. యువత సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే నేరుగా రెండు లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు రుణాలు ఇస్తుందని, తొలి ఏడాదే ఒకే నోటిఫికేషన్ ద్వారా నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు ముస్లిం, క్రిస్టియన్, సిక్కు మైనారిటీలకు సమాన సామాజిక న్యాయం చేస్తామని కవిత స్పష్టం చేశారు. సభా ప్రసంగానికి ముందు కవిత సర్వమత ప్రార్ధనలు చేయటంతో పాటుగా అమరవీరులకు నివాళులర్పించి సభా ప్రాంగణానికి తరలివచ్చారు..


