‘శివ శివాని విద్యా సంస్థల’ ఆధ్వర్యంలో “విద్యా నాయకత్వ సాధికారత” (Empowering Educational Leadership) అనే అంశంపై ప్రతిష్టాత్మక ‘ఎడ్యుకేషన్ కాన్క్లేవ్’ కార్యక్రమానికి తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE) చైర్మన్ ప్రొఫెసర్ బాలకిస్టారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నేటి పోటీ ప్రపంచంలో కేవలం సంప్రదాయ, సిద్ధాంతపరమైన (Theoretical) బోధనకే పరిమితం కాకుండా, నైపుణ్యాధారిత విద్యకు పెద్దపీట వేయాలని పేర్కొన్నారు.
*_ శివ శివాని విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ‘ఎడ్యుకేషన్ కాన్క్లేవ్’.
*_ “విద్యా నాయకత్వ సాధికారత”పై ప్రత్యేక సదస్సు.
*_ ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిస్టారెడ్డి.
*_ సంప్రదాయ విద్యకు స్వస్తి పలికి, నైపుణ్యాధారిత విద్య (Skill-Based Education) వైపు అడుగులు వేయాలని పిలుపు.
*_ విద్యార్థుల్లో తగ్గుతున్న ఏకాగ్రత, విద్యాసంస్థల నిర్వహణ సవాళ్లపై ప్యానెల్ డిస్కషన్.
*_ కార్యక్రమంలో పాల్గొన్న పలు కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యావేత్తలు , హెచ్ఓడీలు.
లోకల్ వైబ్స్, కొంపల్లి: మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యలో ప్రమాణాలు, విద్యా నాయకత్వంలో సాధించాల్సిన మార్పులపై చర్చించేందుకు ‘శివ శివాని విద్యా సంస్థల’ ఆధ్వర్యంలో “విద్యా నాయకత్వ సాధికారత” (Empowering Educational Leadership) అనే అంశంపై ప్రతిష్టాత్మక ‘ఎడ్యుకేషన్ కాన్క్లేవ్’ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఉన్నత విద్య భవిష్యత్తును పునర్నిర్వచించడానికి అవసరమైన ఆవిష్కరణలు, వ్యూహాత్మక దృష్టి, పరస్పర సహకారం వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో ప్రముఖ అకాడమిక్ నాయకులు లోతుగా చర్చించారు. విద్యా రంగంలో ఉన్నత ప్రమాణాలు సాధించడానికి అవసరమైన ఉత్తమ పద్ధతులను పంచుకున్నారు.

నైపుణ్యాలే ఆయుధం.. ప్రాక్టికల్ లెర్నింగ్కే పెద్దపీట
ఈ కార్యక్రమానికి తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE) చైర్మన్ ప్రొఫెసర్ బాలకిస్టారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నేటి పోటీ ప్రపంచంలో కేవలం సంప్రదాయ, సిద్ధాంతపరమైన (Theoretical) బోధనకే పరిమితం కాకుండా, నైపుణ్యాధారిత విద్యకు పెద్దపీట వేయాలని ఆయన ఉద్ఘాటించారు. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ప్రస్తుత అవసరమని తెలిపారు. ఎవియేషన్ మేనేజ్మెంట్ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులకు విభిన్నమైన ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన సూచించారు. విద్యాసంస్థలు సామాజిక బాధ్యతతో పాటు ఇండస్ట్రీ అలైన్మెంట్పై దృష్టి సారించాలని గుర్తుచేశారు.

సవాళ్లు – పరిష్కారాలపై ప్యానెల్ చర్చ
సదస్సులో భాగంగా విద్యాసంస్థల నిర్మాణం, నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లపై నిర్వహించిన ప్యానెల్ చర్చ విజయవంతంగా జరిగింది. బద్రుకా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అభిరామకృష్ణ మోడరేటర్గా వ్యవహరించిన ఈ చర్చలో.. పలువురు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ జి.ఎస్.వి.ఆర్.కె. చౌదరి(ప్రిన్సిపాల్, బద్రుకా కళాశాల), డాక్టర్ నీతూ(ప్రిన్సిపాల్, ఎల్బీనగర్ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్), డాక్టర్ బి. మోహన్ కుమార్ (ప్రిన్సిపాల్, బీసీసీఏ, హైదరాబాద్), డాక్టర్ రాధికా హరినార్థిని(ప్రిన్సిపాల్, టీజీఎస్డబ్ల్యూఆర్డీసీడబ్ల్యూ, ఇబ్రహీంపట్నం) ప్యానలిస్టులుగా చర్చించారు. ప్రస్తుత రోజుల్లో విద్యార్థుల దృష్టి మరల్చే అంశాలు (Distractions) పెరిగిపోవడం, వారిలో ఏకాగ్రత (Attention Span) తగ్గిపోతున్న తీరుపై నిపుణులు విశ్లేషణాత్మకంగా చర్చించారు. నాణ్యమైన విద్యను అందించడంలో ఎదురవుతున్న ఈ సవాళ్లను అధిగమించడానికి సరికొత్త బోధనా విధానాలు, అనుభవాత్మక అభ్యాసం (Experiential learning) ,సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని నిపుణులు సూచించారు.ఈ కాన్క్లేవ్లో జాస్పర్ ఇండస్ట్రీస్ హెచ్ఆర్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి దాసరి, శివ శివాని సంస్థల వైస్ ప్రెసిడెంట్ అండ్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ శైలేష్ సంపతి, వైస్ ప్రెసిడెంట్ దీపికా సంపతి, డైరెక్టర్ డాక్టర్ ఎస్.వి. రమణారావుతో పాటు పలు కళాశాలల ప్రిన్సిపాళ్లు, వైస్ ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు (HODs) తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

