మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడనే కక్షతో.. సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ తన కుమారుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఈ దారుణానికి ఒడిగట్టే ముందు నిందితుడు ఇంటర్నెట్లో ‘ఒకరిని ఎలా చంపాలి’ (HOW TO KILL) అని వెతకడం గమనార్హం.
_ సహజీవనం చేస్తున్న వ్యక్తిని మట్టుబెట్టిన తల్లీకొడుకులు..
_ వేధింపులు తాళలేకే ఘాతుకం..
_జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..
_ వివరాలు వెల్లడించిన కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి..
లోకల్ వైబ్స్, జీడిమెట్ల: రోజూ మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడనే కక్షతో.. సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ తన కుమారుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఈ దారుణానికి ఒడిగట్టే ముందు నిందితుడు ఇంటర్నెట్లో ‘ఎలా చంపాలి’ (HOW TO KILL) అని వెతకడం గమనార్హం. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటిరెడ్డి మంగళవారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బాలానగర్లోని సూర్య ఇంజినీరింగ్ వర్క్స్లో పదేళ్ల క్రితం పనిచేస్తున్న సమయంలో గార్లపల్లి అరుణకు, కానాల శివరెడ్డితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా సహజీవనానికి దారితీసింది. అప్పటినుంచి అరుణ తన కుమారుడు సాయిరత్నంతో కలిసి శివరెడ్డితో పాటే సూరారం, షాపూర్నగర్ తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటోంది. గత పది నెలలుగా వీరు చింతల్ పరిధిలోని చెరుకుపల్లి కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే, శివరెడ్డికి మద్యం వ్యసనం ఉండటంతో.. రోజూ పీకలదాకా తాగి వచ్చి తల్లీకొడుకులను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించేవాడు.
GOOGLE ను అడిగి మరి…పథకం ప్రకారమే..
శివరెడ్డి వేధింపులు రోజురోజుకూ మితిమీరడంతో విసిగిపోయిన తల్లీకొడుకులు అతన్ని అడ్డుతొలగించుకోవాలని పథకం పన్నారు. ఇందులో భాగంగా అరుణ కుమారుడు సాయిరత్నం ముందుగా గూగుల్లో ‘హౌ టు కిల్’ అని సెర్చ్ చేశాడు. సమీపంలోని ఓ చికెన్ దుకాణం కు వెళ్లి మటన్ కోసేందుకని నమ్మించి నుంచి కత్తిని తీసుకొచ్చాడు. ఈ నెల 3న రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన శివరెడ్డి వారితో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగి.. ఆ తర్వాత నిద్రలోకి జారుకున్నాడు. ఇదే అదనుగా భావించిన తల్లీకొడుకులు.. నిద్రిస్తున్న శివరెడ్డి గొంతుకోసి దారుణంగా హతమార్చారు.
అడ్డంగా దొరికిపోయారు..
హత్య అనంతరం ఆధారాలు మాయం చేసేందుకు గదిలోని రక్తపు మరకలను శుభ్రం చేశారు. నెత్తురు అంటిన తమ బట్టలను సమీపంలోని నాలా లో పడేశారు. శివరెడ్డి మృతదేహాన్ని ఫ్లోర్ మ్యాట్, ప్లాస్టిక్ కవర్లలో చుట్టి తాళ్లతో కట్టేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిర్మానుష్య ప్రదేశంలో పడేసేందుకు యత్నించారు. అయితే, రాత్రి జరిగిన గొడవ గురించి ఇరుగుపొరుగు వారు ఇంటి యజమాని కృష్ణకు తెలపడం, ఆయన వెళ్లి చూడగా గదిలో రక్తపు మరకలు, ఓ సంచిలో శివారెడ్డి మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితులైన అరుణ, సాయిరత్నంలను మే 4న అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు రక్తపు బట్టలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మీడియా సమావేశంలో ఏసిపి బాల గంగిరెడ్డి, జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


