జీడిమెట్ల ఉప కమిషనర్ (డీసీ) కార్యాలయంలో సోమవారం ఈ విచిత్ర పరిస్థితి నెలకొంది. స్థానిక ఎం.ఎన్.రెడ్డి కాలనీ ఫేజ్-1లో నెలకొన్న పలు మౌలిక వసతుల లేమి, ఇతర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సూదుల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానికులు డీసీ కార్యాలయానికి వచ్చారు.
_ ప్రజావాణిలో కనిపించని అధికారుల జాడ..
_ జీడిమెట్ల డీసీ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం..
_ డిప్యూటీ కమిషనర్ కుర్చీకి వినతి పత్రం అందజేసి…
_ తీవ్ర అసహనంతో వెనుదిరిగిన ఎం.ఎన్.రెడ్డి కాలనీ వాసులు..
లోకల్ వైబ్స్, కుత్బుల్లాపూర్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ప్రజావాణి’లో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. తమ గోడును అధికారులకు వెళ్లబోసుకుందామని వ్యయప్రయాసలకోర్చి కార్యాలయానికి వచ్చిన ప్రజలకు ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. జీడిమెట్ల ఉప కమిషనర్ (డీసీ) కార్యాలయంలో సోమవారం ఈ విచిత్ర పరిస్థితి నెలకొంది. స్థానిక ఎం.ఎన్.రెడ్డి కాలనీ ఫేజ్-1లో నెలకొన్న పలు మౌలిక వసతుల లేమి, ఇతర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సూదుల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానికులు డీసీ కార్యాలయానికి వచ్చారు.
ఖాళీ కుర్చీకి వినతిపత్రం..
ఉదయం 11.30 గంటలు దాటుతున్నా ప్రజావాణి హాలులో ఒక్క అధికారీ విధుల్లో లేరు. బాధ్యుల కోసం ఎంతసేపు నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో కాలనీవాసులు తీవ్ర అసహనానికి గురయ్యారు. గంటల తరబడి ఎదురుచూసి విసుగెత్తిపోయిన వారు.. చేసేది లేక తాము తెచ్చిన వినతిపత్రాన్ని అక్కడున్న డీసీ ఖాళీ కుర్చీపైనే ఉంచి నిరాశగా వెనుదిరిగారు.

8 ఫిర్యాదులు స్వీకరించారు అంట..!
మరోవైపు, సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 8 ఫిర్యాదులు స్వీకరించినట్లు జీడిమెట్ల సర్కిల్ అధికారులు అధికారికంగా వెల్లడించడం గమనార్హం. అయితే, మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఒక్క అధికారీ తమకు అందుబాటులో లేరని, ఎంతకీ రాకపోవడంతోనే విసుగుచెంది తాము కుర్చీకి వినతిపత్రం ఇచ్చి వచ్చామని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు స్వీకరించి ఉంటే ఎంఎన్ రెడ్డి నగర్ వాసులు ఎందుకు ఖాళీ కుర్చీకి వినతిపత్రాన్ని అందజేయాల్సి వచ్చింది..? వారు 11:30 నుంచి 12 గంటల సమయంలో కార్యాలయంలో ఉన్న డిప్యూటీ కమిషనర్ కుర్చీకి వినతి పత్రం ఇచ్చినట్లుగా వారు అందజేసిన ఫోటోలలో తెలుస్తుంది. మరి అధికారులు ఏ విధంగా 8 ఫిర్యాదులు స్వీకరించారు..? లేదా 12 గంటల తర్వాత వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారా..? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

