ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై, ప్రజల నుంచి ఫిర్యాదులు, అర్జీలు స్వీకరించాలి. కానీ, నిజాంపేట సర్కిల్ కార్యాలయంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. తాజాగా సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యానికి, బాధ్యతారాహిత్యానికి నిలువుటద్దంలా నిలిచింది.
_ ప్రజా సమస్యల పట్ల అధికారుల తీవ్ర నిర్లక్ష్యం..
_ వేదికపై ఒక్క వార్డు ఆఫీసరే.. మిగతా వారు ఏరీ?..
లోకల్ వైబ్స్, నిజాంపేట : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమం నిజాంపేట సర్కిల్ కార్యాలయంలో అపహాస్యంగా మారుతోంది. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, వాటికి పరిష్కారం చూపాల్సిన వివిధ విభాగాల అధికారులు విధులకు డుమ్మా కొడుతున్నారు. పాలకుల ఆదేశాలు, ఉన్నతాధికారుల మార్గదర్శకాలను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.నిబంధనల ప్రకారం.. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై, ప్రజల నుంచి ఫిర్యాదులు, అర్జీలు స్వీకరించాలి. కానీ, నిజాంపేట సర్కిల్ కార్యాలయంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. తాజాగా సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యానికి, బాధ్యతారాహిత్యానికి నిలువుటద్దంలా నిలిచింది.
ప్రజావాణిలో ఒక్క అధికారే..!..
సోమవారం నిజాంపేట సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన వేదిక మీద కేవలం వార్డు ఆఫీసర్ మాత్రమే ఉన్నారు. తమ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం వెతుక్కుందామని వ్యయప్రయాసలకోర్చి కార్యాలయానికి వచ్చిన సామాన్యులకు అక్కడ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సంబంధిత అధికారులు లేకపోవడంతో అర్జీదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రజావాణి కార్యక్రమాన్ని కేవలం తూతూమంత్రంగా, మొక్కుబడిగా మమ అనిపిస్తూ.. ప్రజల సమస్యల పట్ల కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న నిజాంపేట సర్కిల్ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ప్రజావాణికి గైర్హాజరైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి సరైన యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


