తప్పనిసరిగా ఉండాల్సిన ‘ఫైర్ ఎన్ఓసీ’ (NOC) లేకుండానే ఏకంగా ఐదంతస్తుల భవనంలో భాషిత కళాశాలను నిర్వహిస్తున్నారని ఎన్ఎస్యూఐ నాయకుడు గొల్ల జాన్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
_ ఫైర్ ఎన్ఓసీ లేకుండానే ‘భాషిత’ కళాశాల నిర్వహణ..
_ కళాశాల భవనాన్ని వెంటనే సీజ్ చేయాలి..
_ డీఎఫ్ఓకు తెలంగాణ ఎన్ఎస్యూఐ నాయకుడు గొల్ల జాన్ ఫిర్యాదు
లోకల్ వైబ్స్ , చింతల్: అగ్నిమాపక భద్రతా నిబంధనలను తుంగలో తొక్కి, అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న చింతల్లోని భాషిత జూనియర్ కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్ఎస్యూఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అగ్నిమాపక అధికారి (డీఎఫ్ఓ)కి ఎన్ఎస్యూఐ నాయకులు ఫిర్యాదు చేశారు. తప్పనిసరిగా ఉండాల్సిన ‘ఫైర్ ఎన్ఓసీ’ (NOC) లేకుండానే ఏకంగా ఐదంతస్తుల భవనంలో కళాశాలను నిర్వహిస్తున్నారని ఎన్ఎస్యూఐ నాయకుడు గొల్ల జాన్ ఆరోపించారు. కనీస అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వందలాది మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటమేనని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి, జిల్లా కలెక్టర్తో పాటు పలువురు సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు సమర్పించినట్లు ఆయన గుర్తుచేశారు. “అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, రేపు ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగి విద్యార్థులకు అనర్థం వాటిల్లితే.. కళాశాల యాజమాన్యంతో పాటు చూసీచూడనట్లు వ్యవహరించిన అధికారులదే పూర్తి బాధ్యత” అని ఆయన హెచ్చరించారు.

భద్రతపై రాజీ పడే ప్రసక్తే లేదు..
పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తున్న భవనాలలో యాజమాన్యాలు విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. భద్రత అంశంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన భాషిత కళాశాల భవనాన్ని తక్షణమే సీజ్ చేయాలనీ, విద్యార్థుల భద్రతను గాలికొదిలేసిన యాజమాన్యంపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ, విధుల్లో నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారుల బాధ్యతను నిర్ధారించి చర్యలు చేపట్టాలనీ ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే, ఈ అంశంపై భవిష్యత్తులో మరింత తీవ్ర స్థాయిలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఎన్ఎస్యూఐ నాయకులు హెచ్చరించారు.


