_ గాజులరామారం సర్వేనెంబర్ 342/1 ప్రభుత్వ భూమిలో…
_ అక్రమ నిర్మాణాల కూల్చివేత*
లోకల్ వైబ్స్, గాజులరామారం : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 342/1లోని ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు భారీగా కూల్చివేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ కలీం ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఈ చర్యలు చేపట్టారు.

గత కొంతకాలంగా ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కలీం సంబంధిత అంశంపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. అనంతరం ఎమ్మార్వో బైరెడ్డి రాజేష్ ఆదేశాల మేరకు ఉదయం 7 గంటల సమయంలో రెవెన్యూ సిబ్బంది, పోలీసుల సహకారంతో కూల్చివేతల కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ కలీం మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల్లో ఎలాంటి నిర్మాణాలనైనా ఉపేక్షించబోమని, కబ్జాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అలాగే తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు లభిస్తున్నాయనే ప్రచారాలను నమ్మి ఎక్కడపడితే అక్కడ భూములు కొనుగోలు చేసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. భూములు కొనుగోలు చేసే ముందు సంబంధిత రెవెన్యూ రికార్డులను పరిశీలించి యాజమాన్య హక్కులను నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేశారు.


