*– బాచుపల్లి – గండి మైసమ్మ రోడ్డులో ఆక్రమణల్లో తొలగిస్తున్న క్రమంలో..*
*– హైడ్రాధికారుల విధులకు అడ్డుపడిన బాల్ రెడ్డి*
*– ఏమాత్రం ఉపేక్షించకుండా ఆక్రమణలు తొలగించడంతోపాటుగా..*
*– బాల్ రెడ్డి పై దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన హైడ్రా*
*– హైడ్రా ఎస్సై మల్లేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు*

లోకల్ వైబ్స్, దుండిగల్: ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా (HYDRAA), తమ విధి నిర్వహణను అడ్డుకునే వారిపై కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ స్థలాలను రక్షించే క్రమంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకున్నందుకు సదరు వ్యక్తి తో పాటుగా మరొకరిపై హైడ్రాధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు దుండిగల్ పోలీసులు.
*రహదారినీ ఆక్రమించి..*
బౌరంపేట్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 258/5, 259/8 వద్ద, గండిమైసమ్మ ‘ఎక్స్’ రోడ్డు నుండి బాచుపల్లి వెళ్లే మార్గంలో కొందరు రోడ్డును ఆక్రమించి అక్రమంగా షట్టర్లు నిర్మించారు. వాస్తవానికి ఈ ప్రధాన రహదారి మాస్టర్ ప్లాన్ ప్రకారం 150 అడుగుల (150′-0″) వెడల్పు ఉండాలి. కానీ, రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఈ షట్టర్లను స్క్రాప్ వ్యాపారం, డోర్ ఫ్రేమ్స్ విక్రయాలు, మరియు ప్లైవుడ్ టేబుల్స్ తయారీదారులకు అద్దెకు ఇచ్చి లబ్ది పొందుతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ కు, సాధారణ ప్రజలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం (31-03-2026) హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
*అడ్డుకునే ప్రయత్నం..*
అక్రమ షట్టర్లను తొలగిస్తున్న క్రమంలో బాల్ రెడ్డి అనే వ్యక్తి, మరొకరు హైడ్రా బృందం యొక్క చట్టబద్ధమైన విధులకు ఆటంకం కలిగించారు.దీనిపై హైడ్రా ఇన్స్పెక్టర్ మల్లేశ్వర్ ఇచ్చిన వ్రాతపూర్వక ఫిర్యాదు మేరకు, దుండిగల్ పోలీసులు సదరు బాల్ రెడ్డి, మరొకరిపై క్రైమ్ నంబర్ 312/2026 కింద, 126(2) మరియు 221 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినా, లేదా ఆక్రమణల తొలగింపు చర్యలకు ఆటంకం కలిగించినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా అధికారులు స్పష్టం చేస్తున్నారు.
@ఈ వార్తకు సంబంధించిన యూట్యూబ్ వీడియో కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి:

