*– కుప్ప కూలిన వాష్రూమ్..
*– సెల్లార్ గుంతలో పడి తీవ్ర గాయాలు పాలైన బ్లింకిట్ ఉద్యోగి!
*– గాజులరామారంలో ఘటన
లోకల్ వైబ్స్, గాజులరామారం: హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ జోరు ఊపందుకుంది. ఆకాశహర్మ్యాలు వెలుస్తున్నాయి. కానీ, కొందరు బిల్డర్ల అత్యాశ, నిర్లక్ష్యం సామాన్యుల ప్రాణాల మీదకు తెస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా తవ్వుతున్న భారీ సెల్లార్ గుంతలు ‘మృత్యు కుహరాలు’గా మారుతున్నాయి. తాజాగా, గాజులరామారంలో వాష్ రూమ్ కు వెళ్లిన ఓ యువకుడు, బిల్డర్ నిర్లక్ష్యంతో లోతైన గుంతలో పడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే:
గాజులరామారం హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఓ భారీ బహుళ అంతస్తుల భవన నిర్మాణం జరుగుతోంది. దీని కోసం బిల్డర్ రక్షణ చర్యలకు విరుద్ధంగా, అత్యంత ప్రమాదకర రీతిలో భారీ సెల్లార్ గుంతను తవ్వారు. చుట్టుపక్కల ఉన్న భవనాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను కూడా ఇక్కడ గాలికొదిలేశారు.ఈ ప్రమాదకర తవ్వకాలకు అనుకునే పక్కనే ఉన్న భవనంలో ప్రముఖ ఆన్లైన్ డెలివరీ సంస్థ ‘బ్లింకిట్’ కార్యాలయం నడుస్తోంది. ఇందులో సాయికుమార్ (27) అనే యువకుడు పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం సుమారు నాలుగున్నర గంటల సమయంలో, సాయికుమార్ విధి నిర్వహణలో ఉంటూ వాష్రూమ్కు వెళ్లాడు.
ఒక్కసారిగా కుప్పకూలిన వాష్ రూమ్:
సాయికుమార్ వాష్ రూమ్లో ఉన్న సమయంలోనే, దానికి ఆనుకుని ఉన్న లోతైన సెల్లార్ గుంత కారణంగా నేల పల్చబడి, ఒక్కసారిగా వాష్ రూమ్ భవన భాగం కుప్పకూలిపోయింది. ఊహించని ఈ ప్రమాదంతో సాయికుమార్ ఆ భారీ లోతైన గుంతలో పడిపోయాడు. భవన శిథిలాలు అతడిపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు.

వేగంగా స్పందించిన 108 సిబ్బంది:
ప్రమాదాన్ని గమనించిన తోటి ఉద్యోగులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఈఎం టీ నరేందర్ రెడ్డి, పైలెట్ శ్రీనివాస్ లు అత్యంత గాయాల పాలైన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించడంలో అత్యంత జాగ్రత్త వ్యవహరించారు. గుంతలో పడిన బాధితుడిని అక్కడి వారి సహాయంతో బయటకు తీసి, అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

బిల్డర్పై చర్యలకు స్థానికుల డిమాండ్:
ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాభాల కోసం కనీస రక్షణ చర్యలు పాటించకుండా ఇళ్ల మధ్యలో ఇంత లోతైన గుంతలు తవ్వడంపై మండిపడుతున్నారు. మృత్యు కుహరంగా మారిన ఈ సెల్లార్ యజమానిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుడు సాయికుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి ప్రమాదకర నిర్మాణాలను అడ్డుకోవాలని కోరుతున్నారు.ఈ ఘటన నగరంలో జరుగుతున్న ప్రమాదకర నిర్మాణాలకు సజీవ సాక్ష్యం. అభివృద్ధి పేరుతో సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడే బిల్డర్లకు, వారికి సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

