చోరీ చేసిన ఆటోల్లో తిరుగుతూ ఒంటరి మహిళల మెడల్లోని బంగారాన్ని లాక్కెళ్తున్న నలుగురు సభ్యులను జీడిమెట్ల, సీసీఎస్ పోలీసులు పక్కా వ్యూహంతో కటకటాల వెనక్కి నెట్టారు. శనివారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుత్బుల్లాపూర్ డీసీపీ కోటి రెడ్డి ఈ కేసుకు సంబంధించిన ఆసక్తికర వివరాలను వెల్లడించారు.
_ సీసీ కెమెరాల ఆధారంగా స్నాచర్ల గుట్టురట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
_ రూ. 5 లక్షల విలువైన ప్రాపర్టీ సీజ్.. నలుగురు సభ్యుల అరెస్ట్
లోకల్ వైబ్స్, జీడిమెట్ల: ఉదయం పూట ప్రశాంతంగా వాకింగ్ చేద్దామని రోడ్డెక్కుతున్న మహిళలకు ఆ ముఠా కంటిమీద కునుకు లేకుండా చేసింది. మత్తు పదార్థాలకు బానిసై, జల్సాల కోసం దొంగతనాలనే వృత్తిగా ఎంచుకున్న ఓ కిలాడీ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసుల వలలో పడింది. చోరీ చేసిన ఆటోల్లో తిరుగుతూ ఒంటరి మహిళల మెడల్లోని బంగారాన్ని లాక్కెళ్తున్న నలుగురు సభ్యులను జీడిమెట్ల, సీసీఎస్ పోలీసులు పక్కా వ్యూహంతో కటకటాల వెనక్కి నెట్టారు. శనివారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుత్బుల్లాపూర్ డీసీపీ కోటి రెడ్డి ఈ కేసుకు సంబంధించిన ఆసక్తికర వివరాలను వెల్లడించారు.

ఈజీ మనీ కోసం.. ఆటోల చోరీ.. ఆపై స్నాచింగ్స్..
జగద్గిరిగుట్టలోని ఎల్లమ్మబండ సిక్కు బస్తీకి చెందిన ఈ యువకులు వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవించేవారు. అయితే, రోజూ సాయంత్రం వైన్ షాపులు, గురుద్వారా వెనుక ప్రాంతాల్లో మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు బానిసలయ్యారు. తమ జల్సాలకు డబ్బు చాలకపోవడంతో ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కారు. ముందుగా ఆటోలను అపహరించి, వాటిలో నగర శివారు ప్రాంతాలైన దుండిగల్, కుత్బుల్లాపూర్, కేపీహెచ్బీ, చింతల్ తదితర ఏరియాల్లో తెల్లవారుజామున చక్కర్లు కొట్టేవారు. ఒంటరిగా వాకింగ్ చేసే మహిళలను టార్గెట్ చేసి, వారిపై దాడికి దిగి విలువైన వస్తువులతో ఉడాయించడం వీరి స్టైల్.
సీసీ కెమెరాల ఆధారంగా..
ఈ నెల 26న చింతల్ ప్రాంతానికి చెందిన శ్రీలత అనే మహిళ ఉదయం 5 గంటలకు కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద వాకింగ్ చేస్తుండగా, ఈ ముఠా తమ ఆటోలో వచ్చి దాడికి తెగబడింది. ఆమెను గాయపరిచి 2 తులాల బంగారు చైన్, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. అప్పటికే ఆటోలో ఐదుగురు ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. ఏకంగా 6 స్పెషల్ టీమ్స్ను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక డేటా, పాత నేరస్థుల కదలికలను ట్రాక్ చేసిన పోలీసులు.. నిందితులు సిక్కు బస్తీలో తలదాచుకున్నట్లు గుర్తించి పక్కా స్కెచ్తో పట్టుకున్నారు.

కటకటాల వెనక్కి పాత నేరస్థులు..
పోలీసుల దాడుల్లో ప్రధాన నిందితులైన డాంక్ గోవింద్ సింగ్(24), భువాని కరణ్ సింగ్(21), హర్దీప్ సింగ్(19)లతో పాటు ఒక మైనర్ బాలుడు పట్టుబడగా.. మరొకరు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఈ గ్యాంగ్పై గతంలోనూ కూకట్పల్లి, కేపీహెచ్బీ, జగద్గిరిగుట్ట పీఎస్లలో పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. వీరి నుంచి ఓ ఆటో, హోండా డియో స్కూటర్, మొబైల్, రెండు తులాల బంగారు గొలుసు (మొత్తం విలువ రూ. 5 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఈ కేసును వేగంగా ఛేదించిన ఏసీపీ బాల గంగిరెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ నాగేంద్రరావు, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మల్లేష్ బృందాన్ని డీసీపీ కోటిరెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు.

