బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు విచారణలో రాజకీయాలకు తావులేదని, ఆధారాలే ప్రామాణికంగా దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ, సిట్ (SIT) అధికారిణి రీతిరాజ్ ఉద్ఘాటించారు.
_చట్టం ముందు అందరూ సమానులే.. పక్కా ఆధారాలతోనే ముందుకు!..
_బండి భగీరథ పోక్సో కేసుపై డీసీపీ, సిట్ అధికారిణి రీతిరాజ్ కీలక వ్యాఖ్యలు
_ బాధితురాలికి న్యాయం చేయడమే తొలి ప్రాధాన్యత అని వెల్లడి
లోకల్ వైబ్స్, పేట్బషీరాబాద్: బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు విచారణలో రాజకీయాలకు తావులేదని, ఆధారాలే ప్రామాణికంగా దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ, సిట్ (SIT) అధికారిణి రీతిరాజ్ ఉద్ఘాటించారు. సోమవారం ఆమె పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను సందర్శించి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు పురోగతిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తు వివరాలను వెల్లడించారు.

సాంకేతిక ఆధారాలపై ప్రధాన దృష్టి..
బండి భగీరథ పై నమోదైన ఫోక్సో కేసుకు సంబంధించి స్థానిక ఏసీపీ, ఎస్హెచ్ఓలతో సుదీర్ఘంగా సమీక్ష జరిపామని, దర్యాప్తును వేగవంతం చేసేందుకు ఒక స్పష్టమైన కార్యాచరణను సిద్ధం చేయడంతోపాటు, ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలాన్ని సైతం నమోదు చేయడం జరిగిందని రీతిరాజ్ పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలన కాల్ డేటా రికార్డులతో (CDR) పాటు ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించే పనిలో ఉన్నాం అని రీతిరాజ్ వివరించారు.
ఒత్తిళ్లకు ఆస్కారమే లేదు..
నిందితుడు విఐపీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం వల్ల కేసును నీరుగార్చే ప్రయత్నాలు గానీ, జాప్యం గానీ జరుగుతున్నాయా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె దీటుగా బదులిచ్చారు. “మాపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు. నిందితుల సామాజిక, రాజకీయ నేపథ్యాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. చట్టం దృష్టిలో ఇదొక పోక్సో కేసు మాత్రమే. బాధితురాలికి సత్వర న్యాయం అందించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యం. ఫిర్యాదులోని అంశాలను లోతుగా విచారిస్తున్నాం. నిందితుడికి నేరంతో సంబంధం ఉందని సాంకేతికంగా, శాస్త్రీయంగా ఆధారాలు లభిస్తే.. చట్ట ప్రకారం కచ్చితంగా అరెస్టు చేసి తీరుతాం” అని ఆమె స్పష్టం చేశారు.


