రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్ (Arrive Alive)’ కార్యక్రమం బాలానగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో విజయవంతంగా కొనసాగుతోంది.
*_ రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించిన బాలనగర్ ట్రాఫిక్ పోలీస్ సిఐ శ్రీనివాసరావు.
లోకల్ వైబ్స్, బాలానగర్: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్ (Arrive Alive)’ కార్యక్రమం బాలానగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో విజయవంతంగా కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు మంగళవారం, అంబేద్కర్ జయంతి వేడుకల నేపథ్యంలో ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు, వాహనదారులకు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించారు.
హెల్మెట్ ధారణ ప్రాముఖ్యత..
బాలానగర్ ట్రాఫిక్ సీఐ పి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న యువతకు, స్థానికులకు సురక్షిత ప్రయాణంపై దిశానిర్దేశం చేశారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ వాడకం వల్ల ప్రాణాపాయం నుంచి ఎలా బయటపడవచ్చో, దాని వల్ల కలిగే ప్రయోజనాలను సీఐ శ్రీనివాసరావు వారికి సవివరంగా వివరించారు.

రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ..
అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించబోమని, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తామని ‘రోడ్డు భద్రత ప్రతిజ్ఞ’ చేయించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటించి తమ కోసం ఎదురుచూసే కుటుంబ సభ్యుల వద్దకు సురక్షితంగా చేరుకోవాలని ఈ సందర్భంగా బాలానగర్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.


