లో ప్రెజర్ మంచినీటి సమస్యను పరిష్కరించాల్సిన కుత్బుల్లాపూర్ జలమండలి అధికారులు కనెక్షన్లు కట్ చేసి, మరొకచోట నుంచి కనెక్షన్లు తీసుకోవాలని చెప్పడంపై స్థానికులు మండిపడుతున్నారు..
_ కుత్బుల్లాపూర్ డివిజన్ వాటర్ బోర్డ్ అధికారుల నిర్వాకం..
_ సమస్య పరిష్కరించడానికి వారాలుగా తాత్సారం..
_ పైప్లైన్ రిపేరు పేరుతో నెల క్రితం తవ్వి, వదిలేసిన 4 అడుగుల గుంత..
_ పైపుల్లో మురుగు, పురుగులు ఉన్నా శుభ్రం చేయకుండానే సిబ్బంది నిర్లక్ష్యం..
_సమస్యను పరిష్కరించకుండానే ‘డమ్మీ’ వేసే యత్నం..
_ మరోవైపు నుంచి కనెక్షన్లు తీసుకోవాలంటూ సలహాలు..
_ సమస్యను పరిష్కరించకుండానే చేతులు దులుపుకునేందుకు యత్నించిన అధికారులను అడ్డుకున్న జనం..
లోకల్ వైబ్స్, సుచిత్ర: తీవ్రమైన లో ప్రెజర్ మంచినీటి సరఫరాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఫిర్యాదు చేస్తే, సమస్యను పరిష్కరిస్తామంటూ గుంతలు తవ్వి… నెల రోజులుగా కాలయాపన చేసి ఇప్పుడు మీరు కనెక్షన్లు వేరొక లైన్ నుంచి తీసుకోండి… ఇక్కడ డమ్మీ వేసేస్తున్నాము అంటూ పనులు చేయబోయిన సిబ్బందిని అడ్డుకున్నారు స్థానికులు. కుత్బుల్లాపూర్ పరిధి వాజపేయి నగర్ సంజీవయ్య నగర్, పద్మా నగర్ ఫేస్-2 కూడలి పరిసర ప్రాంతాల్లో గత నెలలుగా సరైన మంచినీటి సరఫరా లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా గత నెల రోజులుగా తీవ్రమైన లోప్రెషర్ తో మంచినీటి సమస్య ఏర్పడటంతో ఫిర్యాదుల మేరకు స్పందించిన వాటర్ బోర్డ్ అధికారులు పరిశీలన చేసి పైప్లైన్లో లోపాలు ఉన్నాయని గుర్తించారు. నీటి ఒత్తిడి తక్కువగా వస్తుందన్న కారణంతో ప్రధాన పైప్లైన్ను కట్ చేసి పరిశీలించగా, అందులో మురుగు, బురద, పురుగులు ఉన్నట్లు గుర్తించారు. అయితే, వాటిని శుభ్రం చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాల్సిన అధికారులు పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లడంతో పరిస్థితి మరింత దిగజారింది.

డమ్మీ వేసి తప్పించుకునే యత్నం..
సమస్యను శాశ్వతంగా పరిష్కరించాల్సిన సిబ్బంది, తాజాగా కట్ చేసిన పైప్లైన్కు ‘డమ్మీ’ అమర్చి పనులు ముగించేందుకు ప్రయత్నించారు. దీనిని గమనించిన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని అడ్డుకున్నారు. “ఇప్పటికే మంచినీరు రాక మురుగు నీటినే వాడుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది, కనీసం ఉన్న కనెక్షన్ను కూడా కట్ చేసి సమస్యను మరింత జటిలం చేశారని వాపోతున్నారు.

మరొకచోట నుంచి కనెక్షన్లు తీసుకోవాలంటు..
రోడ్డుపై ప్రమాదకరంగా గుంతను తవ్వి మంచినీటి పైప్లైన్ ను సుదీర్ఘంగా రోజుల తరబడి పరిశీలించిన అధికారులు సిబ్బంది సమస్యను పరిష్కరించకుండానే బుధవారం సదరు పైప్ లైన్ కు డమ్మీ వేసి గుంత ను పూడ్చివేయాలని భావించారు. దీనిని ప్రశ్నించిన బాధితులకు “ఇక్కడి నుంచి కనెక్షన్ లో ఉన్న ఏడు ఇళ్లకు సంబంధించిన వారు వేరొక పైప్లైన్ నుంచి కనెక్షన్లు తీసుకోవాలని” సలహా ఇస్తున్నారు సిబ్బంది. అయితే దశాబ్ద కాలం కు పైగా తమ ఇళ్లకు నీటి సమస్య లేదా అని కొంతకాలంగానే సమస్య ఏర్పడిందని, దానిని పరిష్కరించేందుకు అధికారులకు ఫిర్యాదు చేయగా ఇప్పుడు కనెక్షన్లు మార్చుకోండి అంటూ సలహాలు ఇస్తున్నారని మండిపడుతున్నారు. ఒకవేళ కనెక్షన్లు మార్చుకోవాలి అని అధికారులు భావిస్తే తమ ఇళ్లకు జలమండలి వారే కనెక్షన్లు ఇప్పించాలని దానికి అయ్యే ఖర్చు మొత్తం వారే భరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్న కనెక్షన్లను పీకేసి కొత్త కనెక్షన్లు తీసుకోండి అని చెప్తున్నా జలమండలి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడివారు.

