గాజులరామారం పరిధిలోని కైసర్నగర్ 2BHK డిగ్నిటీ హౌసింగ్ (డబుల్ బెడ్రూం) కాలనీలో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందించిన కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ బుధవారం ఉదయం 11 గంటలకు స్వయంగా కాలనీలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో కలియదిరిగి అక్కడి పరిస్థితులను, భవనాల స్థితిగతులను నిశితంగా పరిశీలించారు.
_ ‘డబుల్’ సమస్యల పరిష్కారానికి చర్యలు..
_కైసర్నగర్ డిగ్నిటీ హౌసింగ్ కాలనీలో జోనల్ కమిషనర్ పర్యటన..
_ టెర్రస్ లీకేజీలు, బోర్ల సమస్యపై అధికారుల ఆరా..
_ మౌలిక వసతులు కల్పిస్తామని స్థానికులకు హామీ..
_ వినతిపత్రం అందజేసిన సొసైటీ ప్రతినిధులు..
లోకల్ వైబ్స్, కుత్బుల్లాపూర్: గాజులరామారం పరిధిలోని కైసర్నగర్ 2BHK డిగ్నిటీ హౌసింగ్ (డబుల్ బెడ్రూం) కాలనీలో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందించిన కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ బుధవారం ఉదయం 11 గంటలకు స్వయంగా కాలనీలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో కలియదిరిగి అక్కడి పరిస్థితులను, భవనాల స్థితిగతులను నిశితంగా పరిశీలించారు.
*వేధిస్తున్న లీకేజీ సమస్య..*
ప్రధానంగా గత కొంతకాలంగా కాలనీవాసులను వేధిస్తున్న టెర్రస్ (డాబా) లీకేజీ సమస్యను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు, కాలనీ మెయింటెనెన్స్ సొసైటీ సభ్యులు ఆయనను కలిసి తమ ఇబ్బందులను వివరించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున లీకేజీలతో పడుతున్న పాట్లను, స్లాబ్లు దెబ్బతింటున్న వైనాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీటితో పాటు నీటి ఎద్దడిని నివారించేందుకు కొత్తగా మూడు బోర్లు వేయాలని, భద్రత కోసం కాంపౌండ్ వాల్ (ప్రహరీ గోడ) నిర్మించాలని, అలాగే పిల్లలు ఆడుకునేందుకు చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు.

సమీక్షించి త్వరితంగా..
సమస్యలన్నింటినీ సావధానంగా విన్న జోనల్ కమిషనర్.. అధికారులతో సమీక్షించి త్వరితగతిన పనులన్నీ పూర్తి చేస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. అధికారికంగా చర్యలు చేపట్టేందుకు వీలుగా ఈ సమస్యలన్నింటితో కూడిన ఒక లిఖితపూర్వక లేఖను ఇవ్వాలని ఆయన సూచించారు. కమిషనర్ ఆదేశాల మేరకు కాలనీవాసులు తక్షణమే స్పందించి, సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని (మెమొరాండం) జోనల్ కమిషనర్కు అందజేశారు. అధికారుల సానుకూల స్పందనతో తమ సమస్యలకు త్వరలోనే మోక్షం లభిస్తుందని కైసర్నగర్ డబుల్ ఇళ్ల లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


